చెన్నై: మహిళా న్యాయవాదిపై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఆమెతోపాటు అడ్డుకోయిన కుమార్తె కూడా గాయపడింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జమీలా బాను అనే మహిళా న్యాయవాది, కుమారన్ సలైలోని మనీలా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నది. రిసెర్చ్ కోసం పాత కేసులకు సంబంధించిన నోట్స్ తీసుకునేందుకు తన కుమార్తెతో కలిసి న్యాయవాదుల కార్యాలయానికి ఆమె వెళ్లింది. ఇంతలో ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా ఆ ఆఫీస్లోకి ప్రవేశించాడు. న్యాయవాది జమీలా బానుపై కొడవలితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది.
కాగా, జమీలా బాను కేకలు వేయడంతో స్థానికులు పరుగున అక్కడకు వచ్చారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి కొడవలిని అక్కడ వదిలేసి పారిపోయాడు. ఈ దాడిలో మహిళా న్యాయవాది జమీలా ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.