పాన్గల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన దుండగులు ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మల్లాయిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక చింతకుంట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది.
రోజువారీగా స్వగ్రామైన మల్లాయిపల్లి నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న చింతకుంటకు చదువుకునేందుకు కాలినడకన వెలుతుండేది. ఈ క్రమంలో సదరు బాలిక మంగళవారం పాఠశాలకు బయలుదేరగా.. మల్లాయిపల్లికి చెందిన బోయ తుల్జా నాగరాజు, బోయ దాసరి అనిల్ అనే ఇద్దరు యువకులు కాపుకాచి మార్గమధ్యలో బాలికను వెంబడించారు.
బలవంతంగా బాలికను బైకుపై ఎక్కించుకొని దగ్గర్లో ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకరు లైంగిక దాడికి పాల్పడగా మరొకరు సహకరించారు. అనంతరం బాలిక పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఉపాధ్యాయులు, వెంటనే పోలీసులకు సమాచారాన్ని ఇవ్వగా డీఎస్పీ కిరణ్, ఎస్సై నాగన్న సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు.
లైంగిక దాడికి సంబంధిచిన వివరాలు సేకరించారు. తక్షణమే అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించినట్లు డిఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా బాలికపై న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, దండోరా, విద్యార్థి సంఘాలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.