అమరావతి: ఏపీలోని పశ్చిమగోదావరిజిల్లాలో కాల్వలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సంక్రాంతి పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు సరదాగా ఈత కొట్టడానికి రాజవరంలోని ఎర్ర కాలువ వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాలువ లోతు ఎక్కువగా ఉండడంతో జెట్టి ముఖేష్ (21), జెట్టి గణేష్ (20) లు మృతి చెందారు.
ఇంతలో భయాందోళనకు గురైన నలుగురు స్నేహితులు ఒడ్డుకు చేరుకుని గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో యువకుల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు. యువకులంతా విద్యార్థులేనని, మరోవైపు ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.