మణికొండ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలైన సంఘటన నగర శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ఆటోను తప్పించబోయి అతివేగంగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ముందు కూర్చున్న ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళితే….కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుచిత్రకు చెందిన కౌస్తబ్(25), జోడన్(25), ప్రకాష్(23), దీపక్(25) ఆశీష్(24) ఐదుగురు స్నేహితులు, కాగా గురువారం కౌస్తబ్కు గండిపేటలోని చైతన్యభారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల (సీబీఐటీ)లో బీటెక్ సంప్లీమెంటరీ పరీక్ష ఉండటంతో ఏపీ09సీటీ2095 ఎస్ఎక్స్4 మారుతీసుజూకీ కారులో ఐదుగురు బయలుదేరారు.
మధ్యాహ్న 2 గంటలకు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా కొంత సమయం ఉందని సీబీఐటీ నుంచి ఖానాపూర్ వైపు కారులో వెళ్తుండగా మలుపువద్ద ముందుగా వెళ్తున్న ఆటోను తప్పించబోయి అతివేగంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కౌస్తబ్(25) అక్కడిక్కడే దుర్మరణం పాలుకాగా,పక్కన కూర్చున్న జోడన్(25) చికిత్స పొందుతూ మృతి చెందారు. వెనుకల కూర్చున్న ప్రకాష్, దీపక్, ఆశీష్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
వీరిలో కౌస్తబ్ సీబీఐటీలో, జోడన్ వీఎన్ఆర్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ప్రకాష్ ఇంటర్మీడియట్, దీపక్ అవినాష్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆశీష్ తమిళనాడులో బీ టెక్ చదువుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ పంపించి, గాయపడినవారిని స్థానిక కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.
అతివేగమే ప్రాణాలు తీసింది: స్నేహితులు
తమ స్నేహితుడు కౌస్తబ్కు సంప్లిమెంటరీ పరీక్ష ఉందని సుచిత్రా నుంచి తామంతా బయలుదేరి వచ్చాము. కొంత సమయం ఉండటంతో ముందుకు వెళ్లి స్నాక్స్ తిందామని వెళ్లేందుకు కారులో బయలుదేరాం. కానీ మలుపు వద్ద తమకారు వేగంగా వెళ్తుండగా ముందుకు వెళ్తున్న ఆటో ప్యాసింజర్లతో మెల్లిగా వెళ్తుండటంతో అతివేగంతో ఎడమవైపు కారును తిప్పిన సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టాం. ఈ ప్రమాదంలో మా స్నేహితుల ప్రాణాలు కోల్పోయామంటూ తోటి స్నేహితులు ప్రకాష్, దీపక్, ఆశిష్లు కన్నీటి పర్యాంతమైయ్యారు.
కొండంత దుఖాఃన్ని మిగిల్చారు: మృతుల కుటుంబసభ్యులు
చేతికి వచ్చిన కొడుకులు రేపోమాపో ప్రయోజకులౌతారన్న కొండంత ఆశలు పెట్టుకుని జీవిస్తున్నా మాకు ఎదిగిన కొడుకులు చేజారిపోవడం కొండంత దుఖాఃన్ని మిగిల్చారని కౌస్తబ్, జోడన్ కుటుంబసభ్యులు బోరుమన్నారు. కౌస్తబ్ తండ్రి డాక్టర్ ప్రకాష్, జోడన్ తండ్రి సంజీవ్ మృతులను చూసి దుఖఃసాగరంలో మునిగారు. ఇంత ఘోరాన్ని ఊహించలేమంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వాపోయారు.