Prayagraj | నన్ను చంపేయ్.. తిరిగి బతుకుతా.. ఆ తర్వాత తన తాంత్రిక శక్తులతో అద్భుతాలు సృష్టిస్తానని ఓ యువకుడు నమ్మబలికాడు. నిజమే అయి ఉండొచ్చని భావించిన ఎదుటి వ్యక్తి ఆ యువకుడిని చంపి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 10వ తేదీన 37 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి మృతదేహం యమునా నగర్లో లభ్యమైంది. దీంతో స్థానికులు కర్చనా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓ యువకుడు అతన్ని చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
హరిద్వార్లో ఆరు నెలల క్రితం ఆశీష్ దీక్షిత్, నితీశ్ షైనీ కలుసుకున్నారు. నితీశ్ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. దీంతో భవిష్యత్పై నితీశ్ నిత్యం ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో ఆశీష్ నితీశ్కు ధైర్యం చెబుతూ వచ్చేవాడు. భవిష్యత్పై ఆందోళన అవసరం లేదని తనకు అమ్మవారి అనుగ్రహం, తాంత్రిక శక్తులు ఉన్నాయని ఆశీష్ చెప్పాడు.
ఈ క్రమంలో నితీశ్, ఆశీష్ ఇద్దరు కలిసి హరిద్వార్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆశీష్కు ఉన్న ఆధ్యాత్మిక శక్తి పట్ల నితీశ్ ఏదో ఊహించుకున్నాడు. దీంతో ప్రయివేటు జాబ్ కూడా మానేశాడు. అయితే డిసెంబర్ 8వ తేదీన ప్రయాగ్రాజ్కు ఇద్దరు కలిసి వచ్చారు. ఆ రోజు వింధ్యావాసిని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చారు. తనను చంపేయ్.. మళ్లీ బతికి, ఆధ్యాత్మిక, తాంత్రిక శక్తులతో అద్భుతాలు సృష్టిస్తానని నితీశ్కు ఆశీష్ చెప్పాడు. అప్పుడు నీ భవిష్యత్ను పూర్తిగా మార్చేస్తానని నమ్మబలికాడు. దీంతో ఆశీష్ చెప్పినట్టే అతని మెడను నితీశ్ కోసేశాడు. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఆశీష్. మొత్తంగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.