మొయినాబాద్ : అతి వేగంగా వెళ్తున్న ఆటో ముందున్న కారు యూటర్న్ చేస్తుండగా దానిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధిలోని అజీనగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. ఎస్సై జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం జడవారిపల్లి గ్రామానికి చెందిన పల్లె కృష్ణ (21) శుక్రవారం రాత్రి వారి బంధువులతో కలిసి ఆటోలో హైదరాబాద్కు వెళ్తున్నాడు. మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న చాయ్ చెస్కా హోటల్ వద్ద నుంచి ఆటో వెళ్తుండగా ఓ కారు యూటర్న్ తీసుకుంటుంది.
ఆటో డ్రైవర్ కారును తప్పించబోయి ఆటోను డివైడర్ దాటి కుడివైపు రోడ్డులోనికి మళ్లించాడు. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న మరో కారును ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యయి. వారిని చికిత్స కోసం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కృష్ణ అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో శనివారం అర్థరాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.