లక్నో: అమ్మాయిలను వేధిస్తున ముగ్గురు అబ్బాయిలను స్థానికులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరో మతానికి చెందిన ముగ్గురు యువకులు బుధవారం రాత్రి ఇంటికి వస్తున్న తమ కుమార్తెను వేధించారని, చంపుతామని ఆమెను బెదిరించినట్లు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి ముందు ఆ ముగ్గురిని ఒక చెట్టుకు కట్టి కొన్ని గంటలపాటు కొట్టారు. చివరకు పోలీసులు వచ్చి వారిని విడిపించి స్టేషన్కు తీసుకెళ్లారు. మహిళపై వేధింపుల సెక్షన్తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మరోవైపు తమ కుమారుడ్ని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారంటూ ఒక యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు యువతి కుటుంబ సభ్యులతోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. కాగా, ఆ యువతి ముగ్గురిని చెంపలపై కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.