పట్నా : బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ చేశారు. సబ్జి బాగ్ ప్రాంతంలోని ఇంటిపై 2006లో ఎయిర్సెల్ కంపెనీ టవర్ను ఏర్పాటు చేసి ఆపై జీటీఎల్ లిమిటెడ్కు విక్రయించింది. ఆగస్ట్ 2022లో ఈ టవర్ ఉండగా ఇటీవల టవర్ల తనిఖీకి వచ్చిన కంపెనీ అధికారులు టవర్ లేకపోవడం చూసి అవాక్కయ్యారు.
ఏరియా మేనేజర్ మహ్మద్ షానవాజ్ అన్వర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని టవర్ను తొలగించాలని కోరాడని, జీటీఎల్ కంపెనీ గతంలో కొంత ఎక్విప్మెంట్ను తొలగించగా ఆపై మరో బృందం వచ్చి ఎక్విప్మెంట్ అంతటినీ తొలగించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈసారి వచ్చిన వారు టెలికాం ఉద్యోగులు కాదని, కొందరు జీటీఎల్ కంపెనీ ఉద్యోగులుగా ఇంటి యజమానిని నమ్మబలికి మొబైల్ టవర్ను తొలగించారని వెల్లడైందని చెప్పారు.
నాలుగు నెలల కిందటే దొంగలు ఇంటి యజమానిని బురిడీ కొట్టించి టవర్ను లేపేశారని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. టవర్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, కొత్త మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తామని ఇంటి యజమానికి చెప్పిన దొంగలు ఆపై ట్రక్కులో పరికరాలను తీసుకుని ఉడాయించారని చెప్పారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశామని, దొంగలను త్వరలోన పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.