Anjali Death Case | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఢిల్లీలోని కరణ్ విహార్ ప్రాంతంలోని అంజలి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఈ విషయాన్ని అంజలి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, ఈ చోరీ వెనుక అంజలి స్నేహితురాలు, అంజలి మృతి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నిధి హస్తం ఉందని వారు ఆరోపించారు.
ఈ మేరకు అంజలి సోదరి న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఉదయం 7.30 గంటల సమయంలో మా ఇంట్లో చోరీ జరిగినట్లు ఇరుగుపొరుగువారు సమాచారం ఇచ్చారు. మేం వెంటనే అక్కడికెళ్లి చూడగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఉన్న ఎల్సీడీ టీవీ, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఎల్సీడీ టీవీ కొత్తది. దాన్ని మేమే రెండు నెలల కిందటే కొనుగోలు చేశాం’ అని తెలిపింది.
చోరీ ఘటనపై అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి స్పందించారు. అంజలి మృతి ఘటన తర్వాత ఇంటి వద్ద ఉన్న పోలీసులు నిన్న ఎందుకు లేరు..? అని ప్రశ్నించారు. ‘నిన్న ఇంటి ముందు పోలీసులు ఎందుకు లేరు? గత 8 రోజులుగా పోలీసులు అక్కడ ఉన్నారు. కానీ నిన్న ఎవరూ లేరు. దొంగతనం వెనుక నిధి హస్తం ఉందని మేము భావిస్తున్నాము’ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ప్రమాద సమయంలో అంజలితోపాటు స్కూటీపై నిధి కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఘటనపై నిధిని పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నిధి.. అంజలిపై పలు ఆరోపణలు చేసింది. మద్యం సేవించిన అంజలి స్కూటీ నడుపుతానని తనతో గొడవపడినట్లు చెప్పింది. మద్యం మత్తులో స్కూటీని స్పీడ్గా డ్రైవ్ చేసి కారును ఢీకొట్టినట్లు ఆరోపించింది. అయితే నిధి ఆరోపణలను అంజలి తల్లి ఖండించింది. నిధికి మద్యం అలవాటు లేదని.. నిధి అబద్ధం చెబుతోందని తెలిపింది. అంజలి మృతి కుట్రలో నిధి భాగమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిధిపై అంజలి కుటుంబం మరోసారి ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.