గోల్నాక : కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం పై కప్పు కూలడంతో మేస్త్రీకి తీవ్రగాయాలైన ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం… గోల్నాక లక్ష్మీ టాకీస్ సమీపంలో గత కొంత కాలంగా ఓ ఇంటి పునఃనిర్మాణ పనులు నడుస్తున్నాయి.
కాగా.. నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో మంగళవారం సాయంత్రం 5గంటలకు భవనంపై కప్పు ఒక్కసారిగా కూలింది. దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న గోల్నాకకు చెందిన మేస్త్రీ విజయ్కుమార్ (17) పై శిథిలాలు పడడంతో అతని కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.