పహాడీషరీఫ్ : ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్షగూడలో నివాసముంటున్న సునీల్ (21) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు జాబుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు కూడా ఇంటికి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా కట్ చేశాడు. అనంతరం స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో అతని కోసం పలు చోట్ల వెతికినా ఆచూకి లభించలేదు. ఆదివారం సునీల్ సోదరుడు సుధీర్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.