భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఆరుగురు వ్యక్తులు ఒక యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కాబోయే భర్త అయిన యువకుడు 17 ఏళ్ల యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత వారిద్దరూ గుడికి వెళ్లారు. అనంతరం గుడి వెనుక వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో షికారుకెళ్లారు. ఆరుగురు వ్యక్తులు ఆ జంటను గమనించి అడ్డుకున్నారు. కాబోయే భర్త అయిన యువకుడ్ని కొట్టారు. యువతిని పొదల్లోకి తీసుకెళ్లి వరుసగా ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ఆ జంట ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముగ్గురిని రేవాలో, ఇద్దరిని ముంబైలో అరెస్ట్ చేసినట్లు రేవా ఎస్పీ తెలిపారు. మరో నిందితుడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురని వెల్లడించారు.
మరోవైపు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. దీంతో అరెస్టైన ఐదుగురి నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. ఆరో నిందితుడిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత యువతికి 18 ఏళ్లు నిండిన తర్వాత మరో మూడు నెలల్లో ఆమెతోపాటు ఉన్న యువకుడితో పెళ్లి నిశ్చయమైనట్లు ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.