ఉప్పల్, మే 5 : ప్రమాదవశాత్తు కంటైనర్కు విద్యుత్ వైర్లు తగిలి.. విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కంటైనర్తో పాటు మూడు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఉప్పల్ పారిశ్రామికవాడలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. ఉప్పల్ సబ్ఇన్స్పెక్టర్ అంజయ్య కథనం ప్రకారం.. గుజరాత్ నుంచి ఉప్పల్ పారిశ్రామికవాడకు కార్లతో కంటైనర్ బయలుదేరింది. పటన్చెరువు ప్రాంతానికి వచ్చిన కంటైనర్ లోకల్గైడ్ గంగాసాగర్(50) సహాయంతో బుధవారం తెల్లవారుజామున ఉప్పల్ పారిశ్రామికవాడకు చేరుకున్నది. పారిశ్రామికవాడలోకి బుధవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో ప్రవేశించిన కంటైనర్ను.. రోడ్డు పక్కన నిలిపివేయడానికి డ్రైవర్ సహజాద్(38) ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లకు కంటైనర్ తగిలింది. విషయం గుర్తించిన డ్రైవర్ సహజాద్ కిందికి దిగే ప్రయత్నంలో భాగంగా కాలు భూమిపై పెట్టగానే ఎర్త్ వ్యాపించి విద్యుత్షాక్కు గురయ్యాడు.
ఈ విషయం తెలియని గంగాసాగర్ కూడా వాహనంలో నుంచి కిందకు దిగే ప్రయత్నంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెల్లావారుజామున కావడంతో ఆ సమయంలో జనసంచారం లేదు. మంటల్లో చిక్కుకొని రాజస్థాన్కు చెందిన కంటైనర్ డ్రైవర్ సహజాద్, బీహర్ నివాసి, శంషాబాద్లో ఉంటూ లోకల్ గైడ్గా పనిచేస్తున్న గంగాసాగర్ సజీవదహనమయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో కంటైనర్లోని మూడు కార్లు పూర్తిగా దగ్దం కాగా.. మరో రెండు కార్లు పాక్షికంగా దగ్దమైనట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.