ముంబై : సైబర్ నేరాలపై పోలీసులు, సాంకేతిక నిపుణులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ఆన్లైన్లో అమాయకులకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లో సొమ్మును లూటీ చేస్తున్నారు. తాజా ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. నాసిక్కు వెళ్లేందుకు ఆన్లైన్లో క్యాబ్ను బుక్ చేసేందుకు టెకీ ప్రయత్నించాడు. క్యాబ్ బుక్ చేసుకునేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో టెకీ తన సమాచారం అందించి పేమెంట్ కూడా పూర్తిచేశాడు.
వెబ్సైట్లో సాంకేతిక లోపం కారణంగా బుకింగ్ విఫలమైంది. ఆపై తాను ట్రావెల్ ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నానని రజత్ అనే వ్యక్తి టెకీకి ఫోన్ చేసి క్యాబ్ బుకింగ్కు తాను సహకరిస్తానని నమ్మబలికాడు. ట్రావెల్ వెబ్సైట్లో మళ్లీ రూ. 100 చెల్లించాలని మిగిలిన సొమ్ము ట్రిప్ పూర్తయిన తర్వాత చెల్లించవచ్చని చెప్పాడు. దీంతో మళ్లీ డబ్బు చెల్లించేందుకు ప్రయత్నించగా వెబ్సైట్లో తిరిగి సాంకేతిక లోపం తలెత్తింది. బుకింగ్ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగకపోవడంతో ప్రయత్నం విరమించుకున్నాడు.
అయితే కొద్ది గంటల తర్వాత వరుస లావాదేవీల్లో రూ. 2 లక్షలకు పైగా మొత్తం తన ఖాతా నుంచి డెబిట్ అయ్యాయని బ్యాంకు నుంచి మెసేజ్లు రావడంతో టెకీ కంగుతిన్నాడు. క్రెడిట్ కార్డు ఖాతాల నుంచి రూ. 81,400, రూ. 71085, రూ. 1.42 లక్షలు డెబిట్ అయ్యాయని మెసేజ్లు వచ్చాయి. పొరపాటు జరిగిందని గుర్తించిన బాధితుడు బ్యాంకుల కస్టమర్ కేర్ను సంప్రదించి క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయాలని కోరాడు. బాధితుడు సత్వరమే స్పందించడంతో రూ. 71,085 రాబట్టినా మిగిలిన మొత్తం కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.