వనపర్తి : దోపిడీ దొంగలు గొర్రెలను కూడా వదల్లేదు. పెద్ద ఎత్తున గొర్రెలను అపహరించేందుకు యత్నించారు. అప్రమత్తమైన గ్రామస్తులు ఆ దొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
వనపర్తి జిల్లా పరిధిలోని చిమనగుంటపల్లి శివారులో ఓ గొర్రెల యజమాని.. బుధవారం రాత్రి తన గొర్రెలతో నిద్రిస్తున్నాడు. కొంతమంది దోపిడీ దొంగలు డీసీఎం, కారులో అక్కడికి వచ్చారు. గొర్రెల యజమానిని చితకబాది గొర్రెలను దొంగిలించేందుకు యత్నించారు. దీంతో అతను గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అప్రమత్తమై శివారు ప్రాంతానికి చేరుకున్నారు.
దొంగలకు సంబంధించిన కారును, డీసీఎంను ధ్వంసం చేశారు. 9 మంది దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు. దొంగల దాడిలో గాయపడ్డ యజమాని యాదయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.