ముంబై: ఒక హోటల్ గదిలో ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఆమె తల్లి తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం ఈ సంఘటన జరిగింది. వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే సమీపంలోని సీజన్స్ హోటల్ గదిలో ఏడేళ్ల బాలిక శవమై కనిపించింది. ఆమె తల్లి తీవ్ర గాయాలతో అక్కడ పడి ఉన్నది. ఇది చూసిన ఆ హోటల్ సిబ్బంది, కాశిమీరా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాలిక తండ్రి ఆమెను హత్య చేసినట్లు అనుమానించారు. భార్యను కూడా హత్య చేసేందుకు భర్త ప్రయత్నించగా ఆమె తీవ్రంగా గాయపడిందని పోలీసులు తెలిపారు. భార్య, కుమార్తెను హత్య చేసేందుకు ఆ వ్యక్తి హోటల్లో గదిని బుక్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన కుమార్తె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా,ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన అనంతరం హోటల్ నుంచి పారిపోయిన మహిళ భర్త కోసం గాలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.