లక్నో: మద్యం కోసం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన తల్లిని, కొడుకు హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్రంపూర్ గ్రామానికి చెందిన 35 ఏండ్ల రామ్ నరేష్, మద్యం కొనుగోలు కోసం 70 ఏండ్ల తల్లి రమావతిని డబ్బులు అడిగాడు. డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన అతడు పదునైన వస్తువుతో తల్లి తలపై బాదాడు. దీంతో ఆమె చనిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలైన తల్లిని హత్య చేసిన కుమారుడు నరేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి రాజ్కుమార్ శర్మ తెలిపారు.