జైపూర్: బాలికను రూ.3 లక్షలకు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. గర్భం దాల్చలేదని చిత్రహింసలు పెట్టాడు. భరించలేని ఆ బాలిక ఆ ఇంటి నుంచి పారిపోయింది. పిల్లల హక్కుల సంస్థ కంట పడటంతో ఆ బాలిక పట్ల జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్లోని మారుమూల ధోల్పూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఆమె తల్లి, సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి గత ఏడాది 40 ఏళ్ల వ్యక్తికి రూ.3 లక్షలకు అమ్మేశారు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలికను బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఆ బాలిక గర్భం దాల్చనందుకు భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. వేధింపులు భరించలేని ఆ బాలిక ఆ ఇంటి నుంచి పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది.
కాగా, ఆ బాలిక ఇటీవల భర్త ఇంటి నుంచి పారిపోయింది. ధోల్పూర్ గ్రామం నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించి రాజధాని జైపూర్కు చేరుకుంది. బాలల హక్కుల సంఘం బచ్పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) కంట ఆమె పడింది. దీంతో ఆ బాలికను పోలీసులకు అప్పగించారు. ఆమె పట్ల జరిగిన దారుణం గురించి పోలీసులు తెలుసుకున్నారు. పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఆమె నివసించిన ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్కు పంపారు. ఆ బాలికను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు.