హైదరాబాద్ : మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలతో కేసు నమోదైంది. సీఐ నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నాగేశ్వర్ రావు ఈ నెల 7వ తేదీన హస్తినాపురం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వస్తున్నట్లు ఆమెకు సీఐ ముందే ఫోన్ చేసి చెప్పడంతో.. ఆ విషయాన్ని తన భర్తకు తెలిపింది. ఇక మహిళ ఇంటికొచ్చిన సీఐ.. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. రివాల్వర్తో బెదిరించాడు.
అర్ధరాత్రి సమయంలో భర్త కూడా శ్రీ వెంకటేశ్వర కాలనీకి చేరుకుని.. తన భార్యపై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భర్తను సీఐ రివాల్వర్తో బెదిరించాడు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు బయల్దేరాడు. అయితే కారు రోడ్డుప్రమాదానికి గురవడంతో.. సీఐ నుంచి దంపతులిద్దరూ తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.