సికింద్రాబాద్ : నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ ఆదేశాలమేరకు బోయిన్పల్లి పోలీసులు రౌడీషీటర్ రుద్రంగి సాయికిరణ్ అలియాస్ బియ్యం సాయి (27) పైన పీడీ యాక్టును ప్రయోగించారు. ఇప్పటికే తొమ్మిది వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయిపై 6ఈ-పెట్టి కేసులను సైతం నమోదు చేశారు.
చోరీ, లూటీ, దొంగతనం, హత్యాయత్నం, మారణాయుధాలను కలిగి ఉండడం తదితర కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఈమేరకు పోలీసులు పలుమార్లు అతనిని హెచ్చరించడమే కాకుండా పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
కానీ, జైలు నుంచి తిరిగివచ్చిన అతను తన తీరును మార్చుకోకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పదేపదే నేరాలకు పాల్పడుతుండడంతో అతనిపై పీడీ యాక్టును ప్రయోగించినట్లు బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ తరహాలో ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి, తిరిగి నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించేదిలేదని రవికుమార్ హెచ్చరించారు.