మిర్యాలగూడ : పెట్టిన పెట్టుబడికి అధిక డబ్బు ఆశ చూపి రూ.4కోట్లు మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. మిర్యాలగూడ టూ టౌన్ సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాల గూడ పట్టణంలో ఇండియన్ గెలాక్సీ పేరుతో కట్ల రమేశ్, అతడి భార్య రమాదేవి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు, తెలిసిన వ్యక్తుల బలహీనతలు ఆసరాగా చేసుకుని వారిని నమ్మించి సంస్థలో పెట్టుబడులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 76 మంది వద్ద నుంచి రూ.4కోట్లు వసూలు చేసి మోసగించారని తెలిపారు.
బాధితులకు చెప్పిన ప్రకారం డబ్బులు చెల్లించకుండా వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ, తీసుకున్న సొమ్ము సైతం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో పాటు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. వారిద్దరూ బెయిలుపై విడుదల కావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు మరోసారి అదుపులోకి తీసుకొని భార్యాభర్తలిద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించామని వివరించారు.
ప్రజలు అధిక వడ్డీలకు, స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ ప్రజలకు సూచించారు.