కోల్కతా: ఒక రోగి హాస్పిటల్ 8వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శనివారం ఈ సంఘటన జరిగింది. సుధీర్ అధికారి అనే వ్యక్తి వైద్యం కోసం ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే శనివారం అతడు వార్డులోని కిటికీ నుంచి 8వ అంతస్తులోకి దిగాడు. టెర్రస్ పిట్టగోడల క్రాసింగ్ వద్ద కూర్చొన్నాడు. ఇది గమనించిన ఆసుపత్రి వర్గాలు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
కాగా, వెంటనే హాస్పిటల్కు చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రోగి సుధీర్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పొడవైన నిచ్చెనపై అతడి వద్దకు వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించగా కిందకు దూకేస్తానని బెదిరించాడు. దీంతో వారు వెనక్కి తగ్గారు. అయితే ముందు జాగ్రత్త కోసం కింద పరుపులు, వలలు ఏర్పాటు చేశారు. అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంత నచ్చజెప్పినా దిగి రాలేదు.
చివరకు శనివారం మధ్యాహ్నం 1.10 గంటలకు రోగి సుధీర్, హాస్పిటల్ 8వ అంతస్తు పై నుంచి కిందకు దూకాడు. కింద పడుతుండగా అంతస్తుల గోడలకు అతడి తల, శరీరం బలంగా తాకాయి. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోగికి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే అతడి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ హాస్పిటల్ వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని కొంతసేపు మూసివేశారు.