చండీగఢ్: రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ఉసురు తీసింది. కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు. యూనివర్సిటీ వెలుపల కాల్పులు జరుగడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొన్నది. పంజాబ్లోని పాటియాలాలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి పంజాబ్ యునివర్సిటీ ప్రధాన గేట్ వద్ద దౌన్ కలాన్ గ్రామం, తేరి గ్రామానికి చెందిన రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. తుపాకీ కలిగిన కొందరు కాల్పులు జరిపారు. దీంతో దౌన్ కలాన్ గ్రామానికి చెందిన కబాడీ క్లబ్ సభ్యుడు, పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి ధర్మిందర్ సింగ్కు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
పాటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీ వెలుపల మంగళవారం రాత్రి 11.30 గంటలకు జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తుపాకులు చేతపట్టిన కొందరు కాల్పులు జరుపడంతో స్థానికులు భయాందోళన చెందారు. మరో యూనివర్సిటీకి చెందిన హర్బీర్ సింగ్, ధర్మిందర్ సింగ్ మధ్య వ్యక్తిగత శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడితో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని పంజాబ్ పోలీస్ చీఫ్ వీకే భావరాను సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన కాల్పుల ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.