భువనేశ్వర్: ఒడిశాకు చెందిన 66 ఏండ్ల వృద్ధుడి భార్యల సంఖ్య 17కు పెరిగింది. ఇప్పటి వరకు అతడు 14 మంది మహిళలను పెండ్లి చేస్తుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే తాజాగా మరో ముగ్గురు భార్యలు అతడిపై ఫిర్యాదు చేశారు.
ఒడిశాలోని కేంద్రపారా జిల్లా తీర ప్రాంత గ్రామానికి చెందిన రమేష్ చంద్ర స్వైన్ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ బిభు ప్రకాష్ స్వైన్, డాక్టర్ రమణి రంజన్ స్వైన్ వంటి విభిన్న పేర్లతో పలువురు మహిళలను పెండ్లి చేసుకుని అతడు మోసగించాడు. ఒడిశాలో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, అస్సాంలో ముగ్గురు, మధ్యప్రదేశ్లో ఇద్దరు, పంజాబ్లో ఇద్దరు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కో మహిళను వివాహం చేసుకున్నాడు.
కాగా, రమేష్ చంద్ర స్వైన్ నకిలీ వైద్యుడిగా చెలామణి అవుతూ మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో మారు పేర్లు రిజిస్టర్ చేసుకుని పలువురు మహిళలతో స్నేహం చేశాడు. నేర్పుగా తన మ్యాట్రిమోనియల్ స్టేటస్ను దాచిపెట్టేవాడు. 1982లో అతడు తొలిసారి పెండ్లి చేసుకోగా 2020లో చివరిసారి ఢిల్లీలోని ఆర్య సమాజ్లో ఒక ఉపాధ్యాయురాలిని వివాహం చేసుకున్నాడు.
రమేష్ చంద్ర స్వైన్ పెండ్లి చేసుకున్న మహిళల్లో ఛత్తీస్గఢ్కు చెందిన మహిళా చార్టడ్ అకౌంటెంట్, అస్సాంకు చెందిన వైద్యురాలు, ఒడిశాకు చెందిన ఉన్నత విద్యావంతురాలు వంటి పలు రంగాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు. కాలేజీ టీచర్లు, మహిళా పోలీసులు, మహిళా న్యాయవాదులు, మధ్య వయసు మహిళలను కూడా అతడు ఆకట్టుకున్నాడు.
అయితే ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న రమేష్ చంద్ర అదృష్టం యూ టర్న్ తీసుకుంది. 2020లో చివరిగా పెండ్లి చేసుకున్న ఢిల్లీకి చెందిన మహిళా టీచర్ ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో మిగతా వివాహాల గురించి బయటపడింది. పంజాబ్కు చెందిన భార్యను రూ.10 లక్షల మేర మోసం చేసినట్లు వెలుగుచూసింది. గురుద్వారాలో ఆమెను పెండ్లి చేసుకున్న అతడు రూ.11 లక్షలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చాడు.
మరోవైపు రమేష్ చంద్ర స్వైన్ గతంలో ఇద్దరిని మోసగించిన కేసుల్లో అరెస్టైనట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. 2006లో ఎర్నాకుళం, 2010లో హైదరాబాద్కు చెందిన నిరుద్యోగ యువకులను లోన్ పేరుతో అతడు మోసగించాడని చెప్పారు. తాజాగా ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థికి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని నమ్మించిన ఈ నకిలీ వైద్యుడు రూ.18 లక్షలు తీసుకుని మోసగించాడని పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రమేష్ చంద్ర స్వైన్ మొబైల్ ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామని, అతడి ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరుపుతామని భువనేశ్వర్ డీసీపీ యూఎస్ దాస్ తెలిపారు. నిందితుడి వద్ద మూడు పాన్ కార్డులు, 11 ఏటీఎం కార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అతడి ఆర్థిక లావాదేవీల సమాచారం కోసం ఆర్బీఐ సహాయం కూడా కోరతామని వెల్లడించారు.
కాగా, తనపై వచ్చిన ఆరోపణలను రమేష్ చంద్ర స్వైన్ తోసిపుచ్చాడు. తాను నిజంగా డాక్టర్ అని, అంత మంది మహిళలను తాను పెండ్లి చేసుకోలేదని అరెస్ట్ అనంతరం కోర్టుకు తరలిస్తున్నప్పుడు మీడియాతో అన్నాడు.