భోపాల్: ఆయుధాల అక్రమ రవాణా కేసులో జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని మధ్యప్రదేశ్లోని గుణాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శివపురిలోని ఒక వ్యక్తికి వీటిని సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితుల్లో హర్యానాకు చెందిన జాతీయ కబడ్డీ క్రీడాకారుడు రింకు జాట్ ఉన్నట్లు చెప్పారు. సరదాలు, ఈజీగా డబ్బు సంపాదన కోసం అతడు ఈ మార్గం పట్టినట్లు పోలీసులు వివరించారు. మిగిలిన ముగ్గురు నిందితులను రాంపాల్ జాట్, అమీర్ ఖాన్, మహేంద్ర రావత్గా గుర్తించినట్లు వెల్లడించారు.
నలుగురు నిందితుల్లో రింకు జాట్, రాంపాల్ జాట్ హర్యానాలోని సోనిపట్కు చెందిన వారు కాగా, అమిర్ ఖాన్, మహేంద్ర రావత్ మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన వారని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఈ నలుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి కారులో ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు ఆ వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేసినట్లు చెప్పారు. ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఈ తుపాకులు తయారయ్యాయని, వీటిని సరఫరా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఒక బృందాన్ని అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో రవాణా చేసిన ఆయుధాల గురించి కూడా వారిని ప్రశ్నించినట్లు వెల్లడించారు.