ముంబై : ఆమె హిందూ.. అతను ముస్లిం.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కానీ వారి వారి సంప్రదాయాల విషయంలో వారిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. బుర్ఖా ధరించడం లేదని చెప్పి భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన రూపాలీ, ఇక్బాల్ షేక్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఆమె జరా అని పేరు మార్చుకున్నారు. 2020లో ఆ దంపతులకు బాబు జన్మించాడు. అయితే భార్యాభర్తల మధ్య సంప్రదాయాల విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. బుర్ఖా ధరించాలని, కుమారుడిని ముస్లిం సంప్రదాయం ప్రకారం పెంచాలని ఇక్బాల్ షేక్ ఆమెపై ఒత్తిడి చేసేవాడు.
దీంతో ఆమె తన కుమారుడితో కలిసి, భర్తకు దూరంగా ఉంటోంది. విడాకుల కోసం కూడా ఆమె దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని రూపాలీని సోమవారం రాత్రి భర్త పిలిచాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశంతో ఊగిపోయిన ఇక్బాల్.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. రూపాలీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.