భోపాల్: విద్యార్థినికి లవ్ లెటర్ ఇచ్చిన ఒక ఉపాధ్యాయుడ్ని గ్రామస్తులు చితక బాదారు. అతడికి గుండు కొట్టించి ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని మన్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 8వ తరగతి చదవుతున్న విద్యార్థిని 24 ఏండ్ల ప్రైవేట్ స్కూల్ టీచర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల ఆ విద్యార్థినికి ప్రేమ లేఖ పంపాడు. తన ప్రేమను నిరాకరిస్తే ఆమె తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతారని బెదిరించాడు. ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తన పేరెంట్స్కు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులు శనివారం ఆ ఉపాధ్యాయుడ్ని చితక బాదారు. గుండు కొట్టించి ముఖానికి నల్ల రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పది మందిపై కేసు నమోదు చేయడంతోపాటు ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేసి అతడిపై పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మన్సూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.