భోపాల్ : మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది. మృతుడిని 68 ఏండ్ల దయారాం బరోద్గా గుర్తించారు. దయారాం తన ఇంట్లోనే విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. మృతుడి ముఖం, శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దయారాం బరోద్ తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాల్సి ఉండగా అతడి ఫ్రెండ్ పలుమార్లు ఫోన్ చేసినా బరోద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
దీంతో బరోద్ ఫ్రెండ్ నేరుగా అతడి ఇంటికి రాగా బరోద్ విగతజీవిగా పడిఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద మొబైల్ ఫోన్ పీస్లు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఫోన్ చార్జింగ్లో ఉండగా అతడు ఎవరితోనో మాట్లాడుతున్నాడని, అదే సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అనుమానిస్తున్నారు.
దయారాం బరోద్ మరణానికి కారణాలపై ఫోరెన్సిక్ నిపుణులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇంటి వైపుగా హైటెన్షన్ ఎలక్ట్రిసిటీ లైన్ వెళుతుండటంతో ఈ ఘటన జరిగిందా అనే కోణంలోనూ నిపుణులు దర్యాప్తు చేపడుతున్నారని బాద్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ మనీష్ మిశ్రా పేర్కొన్నారు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం బాధితుడి మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు.