దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా కోర్టుకు వర్చువల్గా హాజరుకానున్నాడు. భద్రత కారణాల దృష్ట్యా అఫ్తాబ్ని కోర్టుకు తీసుకురాలేమని, అతడిని వర్చువల్గా హాజరుపర్చేందుకు అనుమతి ఇవ్వాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లాకు, పోలీసులు ఒక లెటర్ అందజేశారు. ఆ లెటర్లో.. అఫ్తాబ్పై దాడిచేస్తామని కొన్ని మత సంఘాలు, కొందరు హెచ్చరించారని, దాంతో అతడిపై కోర్టు ప్రాంగణంలో దాడి జరగవచ్చని పోలీసులు తెలిపారు. దాంతో, మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా అందుకు అంగీకరించారు. ‘ఈ కేసు ఎంత సున్నితమైనదో, దీనికి మీడియా కవరేజీ ఎంత ఉందో, ప్రజలు ఎంతగా ఆసక్తి చూపుస్తున్నారో నాకు తెలుసు’ అన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అఫ్తాబ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకానున్నాడు.
ఒకప్పుడు కాల్సెంటర్లో పనిచేసిన శ్రద్ధా, అఫ్తాబ్ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీళ్లిద్దరూ తరచూ డబ్బు విషయంలో గొడవపడేవాళ్లని సన్నిహితులు చెప్పారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని మెహ్రౌలీలోని తమ ఫ్లాట్లో మే 18వ తేదీన అఫ్తాబ్, శ్రద్ధాను దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని మూడువారాల పాటు ఫ్రిజ్లో పెట్టాడు. ఆమె ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా కాల్చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, ఢిల్లీ అటవీ ప్రాంతంలో పడేశాడు.
శ్రద్ధా బతికే ఉన్నట్టు అందరినీ నమ్మించడం కోసం ఆమె సోషల్మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లు కూడా చెల్లించాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమశైలిలో విచారణ చేయగా అఫ్తాబ్ తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే, అతను పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో అతడికి నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా చేశారు. శ్రద్ధా దారుణంగా హత్యకు గురికావడం వెనక లవ్ జిహాద్ కోణం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.