Crime news : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్తే దారుణంగా కొట్టిచంపాడు. పెళ్లయిన రెండు నెలలకే ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం తానే పోలీసులకు ఫోన్ చేసి.. ‘నా భార్యను చంపేశాను’ అని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), కాన్పూర్ (Kanpur) దేహత్ జిల్లాలోని అక్బర్పూర్ (Akbarpur) ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆర్టీవో కార్యాలయం సమీపంలో గజేంద్ర సంఖ్వార్ (30), సప్నా ఉర్ఫ్ ఆస్మా (29) దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
వృత్తిరీత్యా తాపీమేస్త్రి అయిన గజేంద్ర.. రెండు నెలల క్రితమే సప్నాను ప్రేమించి కోర్టు మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది మతాంతర వివాహం అని తెలుస్తోంది. గజేంద్రకు ఇదివరకే వివాహం కాగా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో సప్నా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా భార్యాభర్తల మధ్య వాగ్వివాదం మొదలైంది. అది తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన గజేంద్ర, ఇంట్లో ఉన్న ఇనుప రాడ్తో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది.
అనంతరం గజేంద్ర స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సప్నాను అక్బర్పూర్ మెడికల్ కాలేజీకి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపారు. నిందితుడు గజేంద్రను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ విషయమై గొడవ జరిగిందా..? లేక మరేదైనా బలమైన కారణం ఉందా..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.