బెంగళూరు: ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించాడు. దీంతో భయాందోళన చెందిన ఇద్దరు అనుచరులు పూజారి సమక్షంలో పోలీసులకు లొంగిపోయి తమ తప్పును ఒప్పుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. స్థానిక ఆలయంలోని కొరగజ్జ స్వామిని శివుని అవతారంగా భక్తులు నమ్ముతారు. కాగా, జోకట్టే ప్రాంతానికి చెందిన నవాజ్, అబ్దుల్ రహీమ్, తౌఫీక్ అనే ముగ్గురు ఇటీవల ఈ ఆలయంలోని హుండీలో అభ్యంతరకరమైన వస్తువులు వేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇటీవల నిరసన ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు కొన్ని రోజుల కిందట నవాజ్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తన అనుచరులను తప్పు ఒప్పుకొని లొంగిపోవాలని కోరాడు. ఇటీవల అతడు మరణించాడు. అనంతరం తౌఫీక్ కూడా నవాజ్ మాదిరిగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో దేవుడి శాపానికి తాము గురై ఉంటామని తౌఫీక్, రహీమ్ భయపడ్డారు.
ఈ నేపథ్యంలో గురువారం వారిద్దరు కొరగజ్జ ఆలయం పూజారిని కలిసి తమ తప్పును ఒప్పుకుని ఆయన సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆధారాల కోసం ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.