లక్నో: సీఎం ఓఎస్డీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అజయ్ మిశ్రా అలియాస్ అరవింద్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. నిందితుడు అజయ్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రికి చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా చెప్పుకుని డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. పలువురిని బెదిరించి, మోసగించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అతడిపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీ ప్రభుత్వ అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడ్ని పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)ను పోలీసులు ఏర్పాటు చేశారు. అతడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల నుంచి యూపీ ప్రభుత్వ అధికారులకు పలు ఫోన్ కాల్స్ చేసి పలువురిని కోటికిపైగా మోసగించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. నిందితుడు అజయ్ మిశ్రా, గోమతీనగర్లో ఉన్నట్లుగా సమాచారం అందడంతో శుక్రవారం అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు 8వ తరగతి తప్పిన అజయ్ మిశ్రా, 2003లో జూనియర్ హైస్కూల్లో చదివాడనిపోలీసులు తెలిపారు. అరవింద్ కుమార్ మిశ్రా పేరుతో నకిలీ టీసీ కోసం అమేథిలోని హైస్కూల్ హెడ్ మాస్టర్కు డబ్బులు ఇచ్చినట్లు తమ దర్యాప్తులో అతడు చెప్పినట్లు వెల్లడించారు. నిందితుడిపై పదికిపైగా కేసులు ఉన్నాయన్నారు.