ముంబై : సైబర్ నేరాలపై పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) సరికొత్త మార్గాల్లో చెలరేగుతున్నారు. సులభమైన టాస్క్ల పేరుతో ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి పెద్దమొత్తంలో నగదును క్షణాల్లో మాయం చేస్తున్నారు. పుణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి పార్ట్టైమ్ జాబ్ పేరుతో స్కామర్లు ఏకంగా రూ. 8.56 లక్షలను కాజేశారు. మెసేజింగ్ యాప్లో బాధితుడు నీలేష్ మోహన్లాల్ బంగ్రీచ (45)ను పరిచయం చేసుకున్న నలుగురు వ్యక్తులు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేస్తూ పెద్దమొత్తంలో నగదును స్వాహా చేశారు.
నిందితులు ఢిల్లీకి చెందిన రియా శుక్లా, ప్రంజల్ సింఘాల్, మన్వీ గోయల్, అవంతిక గులేరియా టెలిగ్రాంలో బాధితుడిని సంప్రదించి పార్ట్టైం జాబ్ ఆఫర్ చేశారు. ఇందుకు రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించి తాము పంపే లింక్స్పై క్లిక్ చేయడం, ఫామ్లు నింపడం, యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వంటి సింపుల్ టాస్క్లను పూర్తి చేస్తే పెద్దమొత్తంలో నగదు లభిస్తుందని బాధితుడిని మభ్యపెట్టారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించితన తర్వాత టాస్క్ల కోసం పెద్దమొత్తంలో నగదు వసూలు చేశారు.
తన సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా యాక్సెస్ లభించకపోవడం వివిధ టాస్క్ల కోసం మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బాధితుడి నుంచి స్కామర్లు రూ. 8.56 లక్షలను దోచుకున్నారు. కాగా పుణేలో ఇదే తరహాలో జరిగిన ఆన్లైట్ టాస్క్ స్కామ్లో బాధితుడిని స్కామర్లు రూ. 7.5 లక్షలకు మోసం చేశారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇలాంటి స్కామ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
Read More