చండీగఢ్: సైకిల్ పార్కింగ్ విషయంపై జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. హర్యానాలోని పంచకుల జిల్లాలో ఈ ఘటన జరిగింది. సెక్టార్ 16 ఇందిరా కాలనీలో నివసించే 55 ఏండ్ల బిందర్ గురువారం రాత్రి తన ఇంటి బయట రోడ్డుపై సైకిల్ను నిలిపి ఉంచాడు. వీధి ఇరుకుగా ఉండటంతో పొరుగున ఉన్న సతీశ్ తన బైక్తో వెళ్లేందుకు దారి లేక ఆగ్రహం చెందాడు. ఈ నేపథ్యంలో బిందర్, సతీశ్ మధ్య ఘర్షణ మొదలైంది. సతీశ్ ఆగ్రహంతో సైకిల్ను బిందర్పై విసిరేశాడు. అంతటితో ఆగక నీకు గుణపాఠం చెబుతానంటూ ఆవేశంతో ఇంటికి వెళ్లాడు. తన ఇద్దరు కుమారులు విక్కీ, సన్నీతోపాటు పొరుగువారైన మహిపాల్, మోహిత్తో కలిసి అక్కడకు వచ్చాడు. వారు తమ వెంట కత్తి, ఇనుప రాడ్లు, కర్రలు తెచ్చారు. బిందర్ ఛాతిపై విక్కీ కత్తితో పొడిచాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.
ఇది చూసిన బిందర్ కుమారుడు రింకు సహాయం కోసం అరిచాడు. రింకు అరుపులు విని అతడి తల్లి, సోదరుడు ఇంటి నుంచి బయటకు రాగా నిందితులు వారిపైనా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, బిందర్ హత్యపై ఆయన కుమారుడు రింకు ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.