లక్నో : ఐబీ, యాంటీ కరప్షన్, ఎన్ఐసీ సహా పలు ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్ధల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ 250 మంది ఉద్యోగార్ధులను మోసగించిన వ్యక్తిని పోలీసులు లక్నోలో బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రతీక్ కుమార్ మిశ్రా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ ప్రజలకు ఫోన్లు చేసి ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్లు ఇప్పిస్తానని మభ్యపెట్టేవాడు.
ఉద్యోగార్ధుల నుంచి కోట్లు దండుకుని పరారవుతుంటాడు. నకిలీ జాబ్ రాకెట్స్పై పలు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కొవిడ్ సమయంలో ప్రతీక్ కుమార్ ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని దాదాపు 250 మంది ఉద్యోగార్ధులకు నమ్మబలికాడు.
దీనికోసం రూ 6500 నుంచి రూ 25,000 వరకూ రిజిస్ట్రేషన్ చార్జీల కింద వసూలు చేశాడు. ఆపై డబ్బు మొత్తం వసూలు కాగానే ఉడాయించాడు. బాధితుల పిర్యాదు ఆధారంగా నిందితుడు ప్రతీక్ కుమార్ మిశ్రాను లక్నోలోని విభూతికండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నకిలీ ఐడీ కార్డు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.