ముంబై: ఒక మహిళ హత్య కేసును స్మార్ట్ పోలీస్ చాలా చురుగ్గా పరిష్కరించారు. 18,000 మంది ఫ్లిప్కార్ట్ కస్టమర్లలో ఆ మహిళా హంతకుడ్ని పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. 2015 డిసెంబర్ 20న వాఘోలి గ్రామంలోని బావిలో ఒక మహిళ మృతదేహం లభించింది. ఆమె కాళ్లు కట్టేసి ఉండగా శరీరంపై పలుచోట్ల కత్తిపోటు గాయాలున్నాయి.
కాగా, ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు ఐదు నెలలు పట్టింది. డిప్యూటీ ఎస్పీ రాజ్ తిలక్ రౌషన్, ఒక రోజు పరిష్కరించని కేసు ఫైళ్లను తిరగేశారు. బావిలో కనుగొన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసుపై ఆయన దృష్టిపడింది. లభించిన ఆధారాలు పరిశీలించగా ఆమె డ్రెస్పై ‘జైపూర్ కుర్తి’ అన్న ట్యాగ్ ఉంది. దీంతో మృతురాలు దానిని ఆన్లైన్లో కొనుగోలు చేసి ఉంటుందని ఆ పోలీస్ అధికారి భావించారు. దీంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా పలు ఈ కామర్స్ సంస్థలకు ఈమెయిల్స్ పంపారు. ‘జైపూర్ కుర్తి’ నుంచి డ్రెస్ కొనుగోలు చేసిన వినియోగదారుల మొబైల్ ఫోన్ నంబర్లు పంపాలని కోరారు.
అమెజాన్లో కేవలం 7 డ్రెస్లు మాత్రమే అమ్ముడు కాగా, ఫ్లిప్కార్ట్లో 18 వేల మంది ఆ డ్రెస్లు కొనుగోలు చేశారు. దీంతో ఆయన 18 వేల మంది వినియోగదారుల మొబైల్ నంబర్లు తెప్పించుకుని పరిశీలించారు. ఆ మొబైల్ నంబర్ల వ్యక్తులు ఆ ఏరియాకు సంబంధించిన క్రైం సీన్లో ఉన్నారా అని పరిశీలించారు. చివరకు మాజీ సైనికుడైన 36 ఏళ్ల ప్రకాష్ చాపేకర్కు ఈ నేరంతో సంబంధం ఉందని తేలింది. అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా ఆ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది.
26 ఏళ్ల కాంచన్ పరదేశితో ప్రకాష్కు 2010లో పరిచయం ఏర్పడింది. దీంతో వివాహితుడైన ప్రకాష్, కాంచన్ మధ్య 2014 వరకు సంబంధం నడిచింది. అయితే విభేదాలతో 2014లో వారిద్దరూ విడిపోయారు. 2015లో తిరిగి కలిశారు. భార్య, భర్తల మాదిరిగా అందరినీ నమ్మించి నాగపూర్లో సహజీవనం చేశారు.
అయితే ప్రకాష్ భార్య ప్రతిభ ఒక రోజు ఆకస్మాత్తుగా కాంచన ఇంటికి వెళ్లింది. భర్తతో ఆమెకు ఉన్న సంబంధం గురించి తెలుసుకుని షాక్ అయ్యింది. దీంతో భర్త ప్రకాష్, సోదరుడు దత్తా లోహర్ సహాయంతో కాంచన హత్యకు ప్లాన్ వేసింది. 2015 డిసెంబర్ 19న కాంచనను ప్రకాష్ తన కారులో నాగపూర్ నుంచి ఉస్మానాబాద్కు లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో లోహర్తో కలిసి ఆమెను హత్య చేశాడు. నిర్మాణుష్య ప్రాంతంలోని బావిలో కాంచన మృతదేహాన్ని పడేశారు.
ప్రకాష్ అరెస్ట్తో ఈ విషయం తెలియడంతో అతడి భార్య ప్రతిభ, ఆమె సోదరుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు విచారణ ఇటీవల ముగియడంతో ఆ ముగ్గురు నిందితులకు కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది.