ముంబై: ఇంటి నుంచి పారిపోయి తనతో వచ్చేందుకు నిరాకరించిన ప్రియురాలిని ప్రియుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్రలోని భివాండిలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల రాజేష్కు 30 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని, ఇల్లు విడిచి పారిపోదామని ప్రియురాలితో అతడు చెప్పాడు. దీనికి ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాజేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 23న ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి పనికి వెళ్తున్న ప్రియురాలిని అతడు వెంబడించాడు. వెంట తెచ్చిన కత్తితో ఆమెపై దాడి చేశాడు. అతడ్ని ప్రతిఘటించిన ఆమెకు శరీరంపై పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. అనంతరం రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఈ సంఘటనపై సమాచారం అందుకున్న భివాండి పోలీసులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి పారిపోయిన రాజేష్ థాణేలో ఉన్నట్లు భివాండి పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు మరునాడు అక్కడకు వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.