థానే: మహారాష్ట్రలోని థానే నగరం కళ్యాణ్ ఏరియాలో దారుణం జరిగింది. తమకు పోయలేదన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణ్ ఏరియాకు చెందిన అజయ్ జల్లె రావత్ (24) ఇటీవల స్థానిక మద్యం దుకాణంలో మద్యం తాగుతుండగా సునీల్ గణేష్ చౌదరి (27), లూటో కట్కుల్ మహాలహర్ (26) అనే ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వెళ్లారు. తమకు కూడా మద్యం పోయాలని అడిగారు.
అయితే, వారికి మద్యం పోసేందుకు అజయ్ జల్లె రావత్ నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన ఆ ఇద్దరూ అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం బాధితుడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండటాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.