College Principal | భోపాల్ : మధ్యప్రదేశ్ ఇండోర్లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
అశ్తోష్ శ్రీవాస్తవ(24) అనే విద్యార్థి బీఎం ఫార్మసీ కాలేజీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే మార్క్ షీట్ ఇవ్వడంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని శ్రీవాస్తవ ఆరోపించాడు. ఫిబ్రవరి 20వ తేదీన కాలేజీకి వెళ్లి తన మార్క్స్ మెమో ఇవ్వాలని ప్రిన్సిపాల్ విముక్త శర్మ(54)ను అశ్తోష్ అడిగాడు. సెవెంత్ సెమిస్టర్ ఫెయిలైన కారణంగా మెమో ఇవ్వడం కుదరదని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీవాస్తవ.. ప్రిన్సిపాల్పై పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్తో నిప్పంటించాడు. 80 శాత కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని అదే రోజు పోలీసులు అరెస్టు చేశారు.