లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఫిరోజాబాద్లోని తుండ్లా ప్రాంతంలో 22 ఏండ్ల పీజీ కాలేజ్ విద్యార్ధిని ఇంటికి తిరిగి వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో బాధితురాలిని దుండగులు తీవ్రంగా కొట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని ఫోన్లో రికార్డు చేశారు.
ఆగ్రా నుంచి తాను ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు తెలిపింది. ఆటోలో ఇతర ప్రయాణీకులున్నారని వారు కుబేర్పూర్ బ్రిడ్జి వద్ద దిగిపోయారని వెల్లడించింది.
ఈ ఘటనలో ముగ్గురు నిందితులకు గాను ఇద్దరిని అరెస్ట్ చేశామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆగ్రా ఎస్పీ సత్యజిత్ గుప్తా వెల్లడించారు. అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు మద్యం సేవించి ఉన్నారని చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు.