బెంగళూర్ : శృంగారానికి నిరాకరించిందనే ఆగ్రహంతో కట్టుకున్న భార్యను కడతేర్చి ఆమె అదృశ్యమైందని కట్టుకధ అల్లిన ప్రబుద్ధుడి ఉదంతం వెలుగుచూసింది. బిహార్కు చెందిన ఎలక్ట్రీషియన్ కుటుంబంతో కలిసి బెంగళూర్లో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు పృధ్వీరాజ్ సింగ్కు తొమ్మిది నెలల కిందట జ్యోతి కుమారితో వివాహమైంది. భార్య వివాహ సమయంలో వయసు దాచిందని, తనపై అనాగరికుడనే ముద్ర వేసి శారీరక సంబంధానికి దూరం పెట్టిందని నిందితుడు వెల్లడించాడు.
పెండ్లికి ముందు తన వయసు 28 సంవత్సరాలని నమ్మబలికిందని ఆపై ఆమెకు 38 సంవత్సరాల వయసు ఉందని తేలిందని చెప్పాడు. తన కంటే వయసులో ఆమె 10 ఏండ్లు పెద్దదని అన్నాడు. తనతో శారీరకంగా కలవకుండా తనను తన కుటుంబసభ్యులను అనాగరికులని గేలి చేసేదని పోలీసులకు తెలిపాడు. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఆమెను చంపేందుకు బిహార్ నుంచి తన స్నేహితుడు సమీర్ కుమార్ను పిలిపించారు.
ఆగస్ట్ 3న వీరంతా ఉడిపికి వెళ్లి అక్కడే జ్యోతికుమారిని ఊపిరిఆడకుండా చేసి ఉసురు తీశారు. ఆపై మృతదేహాన్ని షిరది ఘాట్ వద్ద పడేశారు. బెంగళూర్కు తిరిగివచ్చిన సింగ్ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో సింగ్పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్ట్మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.