శ్రీనగర్ : మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడు రిగ్జిన్ దవా (32)ను లడఖ్లోని లేహ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర నేరానికి పాల్పడిన మూడు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఎస్పీ గురువారం వెల్లడించారు. బాధితురాలు 55 ఏండ్ల మహిళను బుధవారం తెల్లవారుజామున షెనం ప్రాంతంలోని తన నివాసంలో విగతజీవిగా గుర్తించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బృందం మృతురాలిపై హత్యాచారం జరిగిందని గుర్తించి ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారని లేహ్ ఎస్ఎస్పీ పీడీ నిత్య తెలిపారు. ఆ ప్రాంతంలో నేర చరిత కలిగిన రిగ్జిన్ దవాను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని ప్రశ్నించారు. నిందితుడు గొంతు, భుజంపై పెనుగులాడిన గుర్తులు, కాలిపై రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు దవాను మరింత అనుమానించారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా దవా నేరాన్ని అంగీకరించాడు. నేరం జరిగిన ప్రాంతంలో నిందితుడి లోదుస్తులు వంటి కీలక ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.