రాంచీ : నలుగురికి మార్గదర్శకుడిగా నిలవాల్సిన ఉన్నతోద్యోగి నీచంగా ప్రవర్తించాడు. ఐఐటీ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆ ఐఏఎస్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్లోని ఖుంటి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అదుపులోకి తీసుకున్న అధికారిని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సయ్యద్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు.
మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన అనంతరం సోమవారం రాత్రి రియాజ్ అహ్మద్ను కస్టడీలోకి తీసుకున్నామని ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. ఐఐటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో ఒకరైన బాధితురాలు శిక్షణ నిమిత్తం జార్ఖండ్లోని ఖుంటికి వచ్చారు. ఐఐటీ విద్యార్ధుల కోసం శనివారం రాత్రి డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు.
ఈ విందులో అతిధులందరికీ మద్యం సరఫరా చేశారు. ఈ పార్టీలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఐఏఎస్ అధికారి లైంగికంగా వేధించారు. ప్రాధమిక దర్యాప్తులో బాధితురాలి ఆరోపణలు వాస్తవమని వెల్లడయ్యాయని ఎస్పీ చెప్పారు. విద్యార్ధినిని వైద్య పరీక్షలకు తరలించామని ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు.