జైపూర్ : రాజస్ధాన్లో దారుణం వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న 13 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడిని నలుగురు పిల్లల తండ్రి మనీష్ కుమార్గా గుర్తించారు.
తమ కూతురు బహిర్భూమికి వెళ్లగా నిందితుడు ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి తెలిపారు. బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలపగా తాము నేరుగా నిందితుడి ఇంటికి వెళ్లామని అప్పటికే పారిపోయాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టకుంటే తాను పోలీస్ స్టేషన్లోనే సజీవ దహనానికి పాల్పడతానని బాధితురాలు హెచ్చరించారు. పరారీ ఉన్న నిందితుడిని పట్టుకుని కఠిన చర్యలు చేపడతామని పోలీస్ అధికారి అజయ్ శర్మ బాలికకు భరోసా ఇచ్చారు.