న్యూఢిల్లీ : కదులుతున్న కారులో 16 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులతో పాటు నేరం జరిగిన సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తనకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులను కలిసేందుకు వెళ్లిన సమయంలో జూలై 6 రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ దారుణం జరిగింది.
నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జులై 6 సాయంత్రం మోతీ బాగ్ ప్రాంతంలో ఫ్రెండ్ను కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా తనకు గతంలో పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిశారని బాధితురాలు తెలిపింది. ఆపై వారు మరోవ్యక్తికి ఫోన్ చేయగా అతడు కారులో వచ్చాడని తనను మహిపల్పూర్ మార్కెట్కు తీసుకువెళ్లారని పేర్కొంది.
అక్కడ వారు మద్యం సేవించి తనతో బలవంతంగా తాగించారని ఆపై కదులుతున్న కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తాను ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టారని తెలిపింది. లైంగిక దాడి ఘటనను వారు వీడియో తీశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.