ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేశారు. పర్యాటకుల లైంగిక కోరికలు తీర్చడం కోసం మహిళలను సరఫరా చేసే (సెక్స్ టూరిజం) ముఠాను సినీ ఫక్కీలో పట్టుకున్నారు. వలపన్ని ముంబై ఎయిర్పోర్టులో ఆట కట్టించారు. సెక్స్ రాకెట్ నడుపుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్చేసి, వారి బారి నుంచి ఇద్దరు బాధిత మహిళలను రక్షించారు. అనంతరం బాధిత మహిళలను రెస్క్యూ హోమ్కు తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా పోలీస్ కస్టడీ విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు మనీష్ శ్రీధంకర్, ప్రియా థొరాట్కు నగరంలోని సెక్స్ టూరిజం రాకెట్కు సంబంధించి సమాచారం అందింది. దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే క్లయింట్ల లైంగిక అవసరాల కోసం ఈ ముఠా మహిళలను సరఫరా చేస్తుందని తెలుసుకున్నారు. దాంతో వెంటనే రంగంలోకి దిగి ముఠాను ట్రాప్ చేశారు. ఇన్స్పెక్టర్ మనీష్ క్లయింటులా ఆ ముఠా నిర్వాహకురాలికి ఫోన్చేసి మాట్లాడారు.
తాను తన స్నేహితుడితో కలిసి గోవా పర్యటనకు వెళ్తున్నానని, తమకు ఇద్దరు మహిళలు కావాలని ఇన్స్పెక్టర్ మనీష్ అడిగారు. దాంతో కొందరు మహిళల ఫొటోలు పంపి వారిలో ఏ ఇద్దరు కావాలో సెలెక్ట్ చేసుకొమ్మని నిర్వాహకులు కోరారు. ఆ మేరకు పోలీసులు ఇద్దరు మహిళలను సెలెక్ట్ చేయగా.. ఒక మహిళకు రూ.45 వేలకు, మరో మహిళకు రూ.40 వేలకు డీల్ ఫిక్స్ చేశారు. ఆపై మహిళ అప్ అండ్ డౌన్ ప్రయాణంతోపాటు ఇతర ఖర్చులు ఏవైనా క్లయింటే భరించాలని చెప్పారు.
డీల్ ఫైనల్ అయిపోవడంతో ముఠా నిర్వాహకుల్లో ఒకరైన మహిళ మరో ఇద్దరు మహిళలతో కలిసి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చింది. అక్కడికి స్నేహితుడితో కలిసి మఫ్టీలో వచ్చిన ఇన్స్పెక్టర్ మనీష్ ముఠా నిర్వాహకులు అడిగిన రూ.85 వేలు చెల్లించాడు. ముఠాకు చెందిన మహిళ డబ్బులు తీసుకోగానే తన టీమ్ను అలర్ట్ చేశాడు. నిందితురాలిని అరెస్ట్చేసి ప్రశ్నించగా మరో మహిళ ఎయిర్పోర్టు గేటు వద్ద ఉన్నదని చెప్పింది. దాంతో అక్కడి సీఎస్ఐఎఫ్ బలగాల సహకారంతో ఆమెను కూడా అరెస్ట్చేశారు.