ఉస్మానియా యూనివర్సిటీ : భార్యాభర్తలు తగువులాడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్త్ లాలాగూడ శాంతినగర్లో నివాసముండే ఉమెర్ ఖాన్ (31), ఫర్జానా బేగంలకు పదకొండేళ్ల కిత్రం వివాహమైంది.
ఉమెర్ ఖాన్ బాబానగర్లో బిల్ కలెక్టర్గా జీహెచ్ఎంసీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో వారు కవాడిగూడలోని జీహెచ్ఎంసీ క్వార్టర్స్లో నివాసముండేవారు. వారికి ముగ్గురు సంతానం. ఈ క్రమంలో ఉమెర్ఖాన్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ నెల 20న ఇద్దరూ గొడవపడ్డారు. అదేరాజు ఫర్జానాబేగం సోదరుడు వాళ్ల ఇంటికి రావడంతో ఆమె పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి 22న ఫర్జానా ఇంటికి రాగా తాళం వేసి ఉండడంతో భర్త విధులకు హాజరయ్యేందుకు వెళ్లాడనుకుని తిరిగి వెళ్లిపోయింది.
23న వచ్చినప్పటికీ తాళం వేసే ఉండడంతో భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. బంధువులు, స్నేహితులను వాకాబు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.