భోపాల్: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో పొరుగున ఉన్నవారు వచ్చి అతడ్ని చితకబాదారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. హబీబ్గంజ్ ప్రాంతానికి చెందిన 12 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు శుక్రవారం మరణించిన బంధువు అంత్యక్రియల కోసం సెహోర్కు వెళ్లారు. బాలిక సోదరుడు పనిమీద బయటకు వెళ్లాడు.
సాయంత్రం 4 గంటల సమయంలో కరెంట్ మీటర్ రీడింగ్ నమోదు చేసే సోను వర్మ ఆ ఇంటికి వచ్చాడు. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్నట్లు అతడు గ్రహించాడు. దాహం వేస్తోందని తాగేందుకు నీరు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆ బాలిక గ్లాసుతో మంచినీరు తెచ్చి ఇచ్చింది. తాగిన అతడు మరికొంత నీరు కావాలని అడిగాడు. ఆ బాలిక ఇంటిలోకి వెళ్లగా ఆమె వెనుకాలే అతడు లోపలికి ప్రవేశించాడు. ఆమెను దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆ బాలిక భయంతో కేకలు వేయగా పొరుగున ఒక మహిళ అక్కడికి వచ్చింది. ఆమె మిగతా వారిని కూడా పిలిచింది. దీంతో వారంతా కలిసి నిందితుడ్ని పట్టుకుని కొట్టారు. కాగా, అతడు తప్పించుకుని పారిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగా జరిగిన విషయాన్ని ఆమె వారికి చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.