ముంబై: ఆడపిల్లకు జన్మనిచ్చిన ఒక మహిళను అత్తమామలు వేధించసాగారు. భరించలేని ఆమె, మూడు నెలల బిడ్డను నీటి ట్యాంకులో ముంచి హత్య చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ విషాద ఘటన జరిగింది. కాలాచౌకి ఫెర్బందర్ ప్రాంతంలోని సంఘర్ష్ సదన్ భవనంలో నివాసం ఉండే 36 ఏండ్ల సపానా బజరంగ్ మగ్దూంకు ఎనిమిది ఏండ్ల కుమార్తె ఉన్నది. ఆమె మూడు సార్లు గర్భం దాల్చగా ఆడ పిల్లగా అనుమానించి అబార్షన్ చేయించారు. మరోసారి గర్భవతి కావడంతో ఈసారి మగ పిల్లవాడిని కనాలని అత్తమామలు పదే పదే చెప్పడంతో ఆమె ఒత్తిడికి గురైంది.
కాగా, సపానా మూడు నెలల కిందట ఆడ పిల్లకు జన్మనిచ్చింది. దీంతో భర్త కుటుంబం నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తమామలు ఇంటిని వీడిపోవడంతో తల్లిదండ్రులు ఆమె వద్ద ఉంటున్నారు. మరోసారి ఆడపిల్లను కన్నందుకు వేధింపులు భరించలేని ఆ మహిళ దారుణ నిర్ణయం తీసుకున్నది. మంగళవారం భర్త పనికి వెళ్లగా మూడు నెలల ఆడ బిడ్డను నీటి ట్యాంకులో పడేసి మూత వేసింది. దీంతో ఆ పసి బిడ్డ నీటిలో మునిగి చనిపోయింది.
అనంతరం తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత బట్టలకు ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చే వ్యక్తి ఇంటికి వచ్చాడని, తనకు మత్తు ఇచ్చి బిడ్డను ఎత్తుకుపోయినట్లు ఆమె చెప్పింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు.
అనుమానించతగ్గ వ్యక్తులెవరిని గుర్తించకపోవడంతో ఆ మహిళను పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. అత్తమామల వేధింపులు తాళలేక ఆడ బిడ్డను తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకున్నది. దీంతో వాటర్ ట్యాంకులో ఉన్న పాప మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కన్న బిడ్డను చంపిన తల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గురువారం ఆ మహిళను అరెస్ట్ చేశారు.