గురుగ్రామ్ : ఓ లాయర్ మూత్ర విసర్జన కోసం తన మెర్సిడెస్ కారును రోడ్డు పక్కకు ఆపాడు. అటుగా వచ్చిన ఓ ముగ్గురు దుండగులు కత్తితో బెదిరించి కారును దొంగిలించారు. ఈ ఘటన గురుగ్రామ్ పరిధిలోని సెక్టార్ 29 ఏరియాలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లాయర్ అంజు బేడీ అనే వ్యక్తి.. గురువారం రాత్రి తన ఇంటికి మెర్సిడెస్ కారులో బయల్దేరాడు. అయితే మార్గమధ్యలో మూత్ర విసర్జన కోసం అంజు తన కారును ఆపాడు. హ్యుందాయ్ కారులో వచ్చిన ఓ ముగ్గురు దుండగులు.. మెర్సిడెస్ బెంజ్ కారుకు అడ్డంగా ఆపారు. అనంతరం కత్తితో బెదిరించి బెంజ్ కారును దొంగిలించారు. లాయర్ ఏం చేయలేకపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారును దొంగిలించిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.